వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని రాజన్న ఆలయంలో 3 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. రాత్రి 9 గంటలకు నిశిపూజ అనంతరం మహాశివరాత్రి పూజలు ప్రారంభమవుతాయి. ఆలయంలో ఆర్జిత సేవలను రద్ద చేసి భక్తులకు లఘు దర్శనం అమలు చేస్తున్నారు. కోడె మొక్కులను యథాతథంగా ఆలయ సిబ్బంది కొనసాగించనున్నారు. రేపు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు సర్వదర్శనం అమలు చేస్తారు. రేపు తెల్లవారుజామున 3.30 నుంచి 4 వరకు మంగళవాద్యాలు, ఆలయ శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 4 నుంచి 6 వరకు సుప్రభాతం, ప్రాతఃకాలపూజ నిర్వహించనున్నారు.
రేపు ఉదయం 7 గంటలకు స్వామి వారికి టీటీడీ తరుపున పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. అనంతరం.. ఉదయం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. రేపు సాయంత్రం 4 గంటలకు శివదీక్ష మాలధారులను దర్శనానికి అనుమతించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ఆలయంలో మహాలింగార్చన అభిషేకం జరుగుతుంది. రేపు రాత్రి 11.35 గంటలకు రుత్వికులచే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. ఎల్లుండి వేకువజామున స్వామివారికి సుప్రభాతం, ప్రాతఃకాల పూజలు, ఆర్జితసేవలు నిర్వహిస్తారు.