నూతనంగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాలను అరికట్టడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్త టౌన్ ప్లానింగ్ సిబ్బందితో జరిగిన సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి, హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులుతో పాటు కేటీఆర్ హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన ఆశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు సాగుతున్నామని అన్నారు. టౌన్ ప్లానింగ్ శాఖలోనూ అనేక మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. సాధారణ పౌరుడికి అత్యంత పారదర్శకంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని అనుమతులు వచ్చేలా డీపీఎంఎస్ విధానాన్ని అమలులోకి తీసుకుని వచ్చామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ విధానంలో నెల రోజుల గడువును కుదించి 21 రోజుల్లోనే అన్ని అనుమతులు వచ్చేలా చేశామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారం రోజుల్లో దరఖాస్తులో లోపించిన పత్రాల సమాచారాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. అనుమతుల ప్రక్రియలో ఉన్న అనవసర ఆలస్యాన్ని తగ్గించేందుకే ఈ విధానం తీసుకు వచ్చామని తెలిపారు.