హైదరాబాద్: నిజామాబాద్, నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని మెండోర, ఏర్గగట్ల, బాల్కొండ, నందిపేట్ మండలాల్లో వడగళ్ల వాన పడింది. ఆర్మూర్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. భోదన్ డివిజన్లోని కోటగిరి, రెంజల్, నవీపేట్, బోధన్ మండలాల్లోని పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి. వర్షం కారణంగా పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచింది. పసుపు, జొన్న, కంది, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. నిర్మల్ జిల్లాలోని బాసర, బిద్రెల్లి, కిర్గుల్(కె), కిర్గుల్(బి)లో వడగళ్ల వర్షం పడింది. వడగళ్ల కారణంగా బిద్రెల్లిలో గొర్రెల కాపరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.