భోపాల్ : శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రసాదం తిన్న 1500 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని బర్వాని జిల్లాలోని ఓ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులంతా శివరాత్రి సందర్భంగా స్థానికంగా ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ భక్తులందరికీ ప్రసాదం(కిచిడి) అందజేశారు. ఇది తిన్న వారందరూ కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్నారు. అస్వస్థతకు గురైన వారందరిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రితో పాటు మరో రెండు ప్రయివేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు.