మహబూబ్నగర్ : జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దాయికుంట తండా నుంచి మాచారం శివారు వరకు రూ. 30 లక్షల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు, రూ. 60 లక్షలతో చేపట్టిన మహబూబ్నగర్ రోడ్డు నుంచి శంకరయ్యపల్లి వరకు బీటీ రోడ్డు పనులకు మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. అనంతరం మండలంలోని చౌడగడ్డ తండా ప్రభుత్వ పాఠశాలను మంత్రి సందర్శించారు. పాఠశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. పాఠశాలకు కావాల్సిన ఫర్నీచర్, డిజిటల్ తరగతులు చెప్పడానికి వీలుగా కంప్యూటర్లను సీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల కృషి మేరకు చౌడగడ్డ తండా పాఠశాల ప్రయివేటు పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి అన్నారు.