ముంబయి: టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. వచ్చే సీజన్లో ఇషాంత్ ససెక్స్ కౌంటీ క్లబ్ తరఫున ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఐదు ఫస్ట్ క్లాస్, 8 వన్డేల్లో ఆడేందుకు ఏప్రిల్ 4 నుంచి జూన్ 4 వరకు క్లబ్కు అందుబాటులో ఉండనున్నాడు. ఐతే బీసీసీఐ అధికారిక ఆమోదం కోసం ఇషాంత్ చూస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్లో అతన్ని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించని విషయం తెలిసిందే. కౌంటీల్లో ఆడటం ఇషాంత్కు ఇదే తొలిసారి. ఐపీఎల్లో నిరాదరణకు గురైన మరో భారత ఆటగాడు చెతేశ్వర్ పుజారా యార్క్షైర్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లోకి 2007లో అరంగేట్రం చేసిన 29ఏళ్ల స్పీడ్స్టర్ ఇషాంత్ ఇప్పటి వరకు 81 టెస్టులు, 80 వన్డేలు, 14టీ20 మ్యాచ్ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.