కావేరీ నదీ జలాల విషయంలో ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నాళ్లుగానో ఈ జలాల కోసం రెండు రాష్ర్టాలు కొట్టుకుంటున్నాయి. గతేడాది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది. అత్యున్నత న్యాయస్థానం కర్ణాటకను కరుణించింది. తమిళనాడుకు ఇవ్వాల్సిన వాటాను తగ్గించింది. దీంతో కర్ణాటకకు 14.75 టీఎంల నీరు అధికంగా వాడుకునే అవకాశం దక్కింది. కేవలం బెంగళూరు నగరాన్ని దృష్టిలో ఉంచుకొని సుప్రీం ఈ కీలక తీర్పు చెప్పింది. గతంలో ఎన్నడూలేని విధంగా బెంగళూరు నగరం నీటి కోసం అల్లాడుతున్నది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో నీరు అడుగంటిపోతున్న 11 నగరాల్లో బెంగళూరు కూడా ఒకటి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పు వాళ్లకు ఊరట కలిగించేదే.
అదనంగా వస్తున్న నీటిలో కేవలం బెంగళూరు నగరం కోసం 4.75 టీఎంసీల నీటిని వాడుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టంచేసింది. బ్రెజిల్ ఆర్థిక రాజధాని సావోపాలో, సౌతాఫ్రికా రాజధాని కేప్టౌన్లు ఇప్పటికే తాగునీరు కూడా దొరక్క బిక్కుబిక్కుమంటున్న విషయం తెలిసిందే. బెంగళూరు విషయంలో ఇదే జరుగుతున్నది. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి వసతి కల్పించలేకపోతున్నది. సరైన సరఫరా వ్యవస్థ లేకపోవడం బెంగళూరుకు శాపంగా మారుతున్నది. దీంతో చాలావరకు నీళ్లు వృథాగా పోవడమో, కాలుష్యం బారిన పడటమో జరుగుతున్నది. సిటీ ఆఫ్ లేక్స్గా పేరున్నా.. ఒక్క చెరువులోని నీరు కూడా మానవ అవసరాలకు వాడుకొనే పరిస్థితి లేదు.