హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్-2018పై ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించనున్న భారీ సభకు పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, ప్రముఖ సంఘ సేవకురాలు, సినీ నటి అమల, గేయ రచయిత సుద్దాల అశోక్తేజ, దేశపతి శ్రీనివాస్లతో పాటు పలువురు క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 17న దాదాపు 25వేల మందితో స్వచ్ఛ సర్వేక్షణ్-2018పై భారీ చైతన్య సభను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఉప్పల్ స్టేడియంలో 17న ఉదయం 9గంటల నుంచి ఈ స్వచ్ఛ చైతన్య సభను నిర్వహించనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మేయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ.. నగరం నుంచి ప్రాతినిధ్యం వహించే మంత్రులందరూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. స్వచ్ఛ కార్యక్రమాలతో పాటు పలు అంతర్జాతీయ సదస్సులకు ప్రధాన వేదికగాగాను, బాండ్లరూపంలో నిధులను సేకరించిన ద్వితీయ మెట్రో నగరంగా చరిత్ర సృష్టించిన హైదరాబాద్ నగరాన్ని మరింత స్వచ్ఛంగా ఉంచడం, చెత్తను తడి, పొడి చెత్తగా వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు అందించడం, ఇంట్లోనే కంపోస్ట్ ఎరువుల తయారు చేయడంతో పాటు ప్రతి ఇంట్లో విధిగా వాననీటి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని చేపట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ సభ ద్వారా చైతన్య కార్రమాలను నిర్వహిస్తున్నట్టు మేయర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని స్వచ్ఛ స్ఫూర్తి దినోత్సవంగా పాటించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, మహేందర్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని బొంతు రామ్మోహన్ వివరించారు. ఉప్పల్ సర్కిల్లోని స్వయం సహాయక మహిళలు, పాఠశాల, కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు కూడా హాజరవుతారని తెలియజేశారు. సాంస్కృతిక సారథి కళా బృందాలచే కళా ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.