హైదరాబాద్: రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి కేటీఆర్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం ఆనందంగా జీవించాలని గవర్నర్ పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆ దేవుడు చల్లగా చూడాలని, మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, భాస్కర రావు, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీయస్ చిత్ర రామచంద్రన్, ఇతర ప్రముఖులు మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్లకు బేస్ రేట్ కు స్టీలు విక్రయించడంపై స్టీలు యజమానులతో బేగంపేట క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశనాంతరం అల్లోలకు మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా సచివాలయంలోని ఆయన చాంబర్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ఇతర అధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.