పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరింత వేగంగా ముందుకెళుతోంది. ఈ కేసులో ప్రధాన పాత్రధారి, సంపన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.5,000 కోట్లకుపైగా విలువైన బంగారు, వజ్రాభరణాలను జప్తు చేసింది. గురువారం ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, గుజరాత్ తదితర ప్రాంతాల్లోని నీరవ్ మోదీ ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సముదాయాల్లో ఈడీ విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఇందులోభాగంగానే రూ.5,100 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారాన్ని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, సోదరుడు నిషాల్, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీలపై రూ.280 కోట్ల మోసానికి సంబంధించి బుధవారం ఈడీకి పీఎన్బీ ఫిర్యాదు చేసింది. అంతకుముందే ఈ కేసును పీఎన్బీ ఫిర్యాదుతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా విచారణ చేస్తుండగా, తాజాగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసును నమోదు చేసింది. రూ.11,300 కోట్ల మేర పీఎన్బీ కుంభకోణం కేసును కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు కీలకంగా తీసుకున్నాయి.