ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అద్భుతం చేసిన భువీ.. తొలి టీ20లో భారత్ విజయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 09:17 AM

జొహెన్నస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులకే పరిమితమైంది. భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో భారత్ టీమ్ హ్యాట్రిక్ సాధించిన వేళ సఫారీలు ఒత్తిడికి చిత్తయ్యారు. ఛేజింగ్‌కు అనుకూలించే పిచ్ మీద కోహ్లి సేన చరిత్ర తిరగరాసింది. 6.2 ఓవర్లలో 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను ఓపెనర్ హెండ్రిక్స్ (70), ఫర్హాన్ బెహర్డీన్ (39) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. కానీ ఊరించే డెలివరీ వేసిన చాహల్ బెహర్డీన్‌ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో సఫారీ జట్టు 15 ఓవర్లలో 129/4గా నిలిచింది.


మ్యాచ్ హోరాహోరీగా సాగుతున్న స్థితిలో భువీ మ్యాజిక్ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన భువీ.. తొలి బంతికే హెండ్రిక్స్‌ (50 బంతుల్లో 70)ను ఔట్ చేశాడు. నాలుగు, ఐదు బంతుల్లో క్లాసేన్‌ (7 బంతుల్లో 16), మోరీస్ (0)ను అవుట్ చేశాడు. చివరి బంతికి ప్యాటెర్‌సన్‌ను పాండ్య, ధోనీ రనౌట్ చేయడంతో భారత జట్టు టీమ్ హ్యాటిక్ సాధించింది. ఒకే ఓవర్లో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గింది.


భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్య, చాహల్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ శిఖర్ ధావన్ (39 బంతుల్లో 72; 2×6, 10×4) వీర విహారం చేశాడు. దీంతో సఫారీలపై తొలిసారి టీమిండియా టీ20ల్లో 200కిపైగా పరుగులు చేసింది. రోహిత్ (9 బంతుల్లో 21), రైనా (7 బంతుల్లో 15) దూకుడుగా ఆడినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు.


కోహ్లీతో కలసి మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ధావన్.. మనీష్ పాండే (27 బంతుల్లో 29 నాటౌట్; 1×6)తో నాలుగో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధావన్ ఔటయ్యాక భారత జోరు తగ్గింది. చివరి ఐదు ఓవర్లలో ధోనీ (11 బంతుల్లో 16; 2×4), హార్దిక్ పాండ్యా (7 బంతుల్లో 13 నాటౌట్; 2×4) 47 పరుగులు రాబట్టారు. దీంతో భారత్ 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం జరగనుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com