హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్(టీడీఎన్)ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైటెక్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ పనితీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు. సాంకేతికతను ఉపయోగించుకొని ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, తుమ్మలూరు, మన్సాన్పల్లి, సింగూర్పూర్లో పైలట్ ప్రాజెక్టుగా టీడీఎన్(టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్)ను అమలు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను చేరవేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉద్ఘాటించారు. వీలైనంత త్వరగా డిజిటల్ తెలంగాణను తయారు చేయడమే తమ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని స్పష్టం చేశారు. ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కరీంనగర్, వరంగల్లో ఐటీ సేవలను విస్తరిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి అన్నారు.