ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీబీఐ చేతికి రొటామ్యాక్ కేసు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 19, 2018, 11:18 AM

రూ.800 కోట్ల మేర బ్యాంకు రుణం తీసుకొని ఇప్ప‌టివ‌ర‌కూ రుణం, వ‌డ్డీ చెల్లించ‌లేద‌నే కార‌ణంతో సీబీఐ ఈ వ్య‌వ‌హారంపై దర్యాప్తును ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు చేసిన‌ వేల కోట్ల మోసం మ‌రువ‌కముందే.. మ‌రో బ్యాంకు కుంభ‌కోణం వెలుగుచూసింది. కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త విక్రమ్‌ కొఠారీ రూ. 800 కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పరారయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. రొటొమ్యాక్‌ పెన్స్‌ కంపెనీ యజమాని కొఠారీ.. అలహాబాద్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాల్ని ఎగ్గొటారని, ఈ రుణాల మంజూరులో బ్యాంకులు కూడా రాజీపడ్డాయని కథనాలు వెలువడ్డాయి.


ఒక ప‌క్క నేనేమి ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారును కాద‌ని, విదేశాల‌కు పారిపోలేద‌ని కొఠారీ వివ‌ర‌ణ ఇస్తున్న‌ప్ప‌టికీ ఇది మ‌రో బ్యాంకు కుంభ‌కోణ‌మేన‌ని ఆర్థిక విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.ఒక నివేదిక ప్రకారం ముంబైలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి రూ. 485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్‌ బ్యాంకు నుంచి రూ. 352 కోట్లను కొఠారీ రుణంగా తీసుకున్నారని.. ఏడాది గడిచినా అస‌లు, వ‌డ్డీ కొఠారీ చెల్లించలేద‌ని తెలుస్తోంది. కాన్పూర్‌ నడిబొడ్డున ఉన్న కొఠారీ కంపెనీ ప్రధాన కార్యాలయం వారం నుంచి మూసేఉందని.. ఆయన జాడ కూడా తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాను పారిపోయానంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొఠారీ చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి.గ‌తేడాదే రొటామ్యాక్ గ్లోబ‌ల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ను బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుగా ప్ర‌క‌టించింది. తమను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆ కంపెనీ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 300 కోట్లకు పైగా ఆస్తుల్ని ఇచ్చేందుకు సిద్ధమైనా రోటొమ్యాక్‌ను ‘విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌’గా తప్పుగా ప్రకటించారని అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీబీ భోస్లే, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ధర్మాసనం పేర్కొంది. రిజర్వ్‌ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు రొటొమ్యాక్‌ను విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ ఫిబ్రవరి 27, 2017న ఆదేశాలు జారీ అయ్యాయి.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com