ముంబై : గోవా సీఎం మనోహర్ పారికర్ ఆరోగ్యంగానే ఉన్నారని లీలావతి హాస్పిటల్ స్పష్టం చేసింది. పారికర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని వైద్యులు స్పష్టం చేశారు. అవాస్తవ వార్తలను ప్రసారం చేయడం మంచిది కాదని మీడియాకు సూచించింది. పారికర్ ఆరోగ్యం కుదుటపడుతోందని తెలిపారు. ఫుడ్ పాయిజనింగ్తో తీవ్ర అస్వస్థతకు గురైన మనోహర్ పారికర్.. బుధవారం రాత్రి గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గురువారం ఉదయం ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. నిన్న ముంబైకి వచ్చిన ప్రధాని మోదీ.. ఆస్పత్రికి వెళ్లి పారికర్ను పరామర్శించారు.