సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాడు సురేశ్ రైనా. గతేడాది యో యో టెస్టులో పాసైన రైనా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన టీ20లో రైనా 15 పరుగులు సాధించాడు.
మ్యాచ్ అనంతరం రైనా మాట్లాడుతూ..‘తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. తొలిసారి టీమిండియా జెర్సీ ధరించినప్పుడు ఎలా ఫీలవుతామో.. ఇప్పుడు నేను అదే అనుభూతిని పొందాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. గత ఎనిమిది నెలలుగా దేశవాళీ క్రికెట్లో ఏ మ్యాచ్ను వదల్లేదు. చాలా కష్టపడ్డాను. ఫిట్నెస్ సాధించాను. మరోసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. సఫారీ గడ్డపై వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు అభినందనలు. ఈ సిరీస్ విజయంలో కోహ్లీ, ధావన్, రోహిత్, బుమ్రా, భువనేశ్వర్, చాహల్, కుల్దీప్ కీలకపాత్ర పోషించారు. డ్రస్సింగ్ రూమ్లో భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో మెలుగుతున్నారు. ఒకరి పట్ల మరొకరు ఎంతో మర్యాద పూర్వకంగా మెలుగుతున్నారు. ఏదైనా గేమ్లో ఒక ఆటగాడు రాణించకపోయినా ఏమాత్రం నిరాశ చెందడం లేదు. ఇతరులతో కలిసి విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడైనా డ్రస్సింగ్ రూమ్లో ఇలాంటి పరిస్థితులే ఉండాలి. అప్పుడే మనం రాణించగలం’ అని రైనా తెలిపాడు.