కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ సోమవారం కావేరీ ఎక్స్ప్రెస్లో మైసూరు నుంచి బెంగళూరు వరకు ప్రయాణించారు. జనరల్ బోగీలో ఇతర ప్రయాణికులతో కలసి ప్రయాణం చేశారు. రైళ్లలో సేవలు ఎలా ఉన్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. వారు చేసిన సూచనలను ఓపిగ్గా విన్నారు. రైల్వే మంత్రిని జనరల్ బోగీలో చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యానికి గురైనా.. ఆయన వారితో కలసిమెలిసి మాట్లాడటంతో సంతోషం వ్యక్తం చేశారు. అలాగే స్లీపర్ క్లాస్ బోగీల్లోకి కూడా మంత్రి వెళ్లారు. అక్కడి ప్రయాణికులతోనూ కాసేపు ముచ్చటించారు.మైసూరు రైల్వే స్టేషన్లో కొత్త ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి పియూష్ గోయల్ మైసూరు వెళ్లారు. సోమవారం ఉదయం క్వీన్ హుమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైలును కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలసి ప్రధాని ప్రారంభించారు. మైసూరు-బెంగళూరు మధ్య కొత్తగా నిర్మించిన ఎలక్ట్రిఫైడ్ లైన్లో ప్రయాణిస్తుంది. రైలును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రైల్వే రంగంలో బీజేపీ ప్రభుత్వం చేసిన సంస్కరణల గురించి వివరించారు.