పాత స్నేహితుడి వివాహానికి వెళితే ప్రస్తుత స్నేహితుడు తప్పుగా భావిస్తాడోనన్న అపోహే అనీషాను ఆత్మహత్యకు పురిగొల్పిందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె తన స్నేహితుడికి సుమారు 350కిపైగా వాట్సాప్ సందేశాలు పంపినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు యత్నించిన సమయంలో గదిలో స్నేహితురాలు ఉండి ఉంటే అనీషా బతికేదని భావిస్తున్నారు. కొంపల్లిలోని శివశివానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చదువుతున్న అనీషా చౌదరి(23) ఆత్మహత్య కేసుపై పేట్బషీరాబాద్ పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే ఆమె స్నేహితులతోనూ మాట్లాడారు. అనీషాకు త్వరగా కోపం వచ్చేదని, అదేస్థాయిలో ప్రేమ కూడ ఉండేదని ఆమె స్నేహితురాళ్లు తెలిపినట్లు సమాచారం.
అనంతపూర్కు చెందిన మాజీ స్నేహితుడి విషయం దక్షేశ్ పటేల్కు తెలపడం వల్లే ఈ అనర్థం జరిగిందని గుర్తించారు. ఈనెల 21న అనంతపూర్లో జరగాల్సి ఉన్న మాజీ స్నేహితుడి వివాహానికి వెళ్లటానికి దక్షేశ్ అంగీకరించినా అతను ఏమనుకుంటాడోనన్న అపోహ ఆమెను కలిచివేసిందని భావిస్తున్నారు. అనీషా ఉంటున్న గదిలో మరో విద్యార్థిని ఉండేది. ఆమె ఈ సంఘటనకు ఒకరోజు ముందే ఊరెళ్లింది. ఒంటరిగా ఉండటం వల్ల ఈ సంకట స్థితి నుంచి అనీషా బయటపడలేకపోయింది. ఎటూ పాలుపోక 16వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 17వ తేదీ రాత్రి ఒంటి గంట వరకు పటేల్కు సుమారు 350 వరకు వాట్సాప్ సందేశాలు పంపింది. వీడియో కాల్ సంభాషణలతో పాటు, ఈ సందేశాలను కూడా పోలీసులు సేకరించారు. వీటి ప్రకారం... పటేల్ నుంచి అనీషాపై ఎలాంటి ఒత్తిడి లేదని, మాజీ స్నేహితుడి వివాహానికి వెళ్లమని కూడా ఆయన సూచించినట్లు గుర్తించారు.