ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు రెండోరోజుకు చేరుకుంది. ఈ సదస్సులో సోఫియా రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మానవత్వంతోనే మెరుగైన భవిష్యత్తు అనే అంశంపై ఈ ఆడ రోబో ప్రత్యేక ప్రసంగం చేయనుంది. ప్రపంచంలోనే ఓ దేశ పౌరసత్వం ఉన్న ఏకైక రోబో ఇది. అలాగే నేటి సదస్సులో కృత్రిమ మేథస్సు, నూతన టెక్నాలజీపై చర్చించనున్నారు. నాస్కామ్, విట్సా, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడిగా మూడు రోజులపాటు హైదరాబాద్లో నిర్వహిస్తున్న 22వ ప్రపంచ ఐటీ సదస్సును (డబ్ల్యూఐసీటీ) సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.
భవిష్యత్తుకు కీలకంగా గుర్తించిన ఎనిమిది కొత్త టెక్నాలజీల్లో శిక్షణకు నాస్కామ్ రూపొందించిన ఫ్యూచర్ స్కిల్స్ వేదికను కూడా ప్రధాని ప్రారంభించారు. తొలిసారిగా భారత్లో ఈ సదస్సును నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘‘డిజిటల్ యుగంలో ప్రపంచం త్వరితగతిన పురోగమిస్తోంది. ఈ తరుణంలో డిజిటల్ పరివర్తనకు నాస్కామ్ ఎంపిక చేసిన ఎనిమిది నైపుణ్యాలు కీలకమన్నారు. నిన్నటి సదస్సులో కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన టీ ఫైబర్గ్రిడ్ ఇంటర్నెట్ సేవలను కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్తో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.