ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 కోట్ల‌ను దాటేయ‌నున్న ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 21, 2018, 11:58 AM

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో టెక్నాల‌జీ వాడ‌కంతో పాటే భార‌త్ కూడా ప‌రుగెడుతోంది. ప్ర‌స్తుతం మ‌న దేశం డిసెంబ‌రు,2016తో పోలిస్తే 11.34% వృద్దితో డిసెంబ‌ర్,2017 నాటికి 48.1 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగ‌దారుల‌ను క‌లిగి ఉన్న‌ట్లు అంచ‌నా. అదే విధంగా జూన్,2018 నాటి క‌ల్లా 50 కోట్ల మందికి ఇంట‌ర్నెట్ వాడ‌కందారులు పెరుగుతార‌ని ఐఏఎమ్ఏఐ అంచ‌నా వేసింది. దేశంలో ఇంట‌ర్నెట్ వాడ‌కం తీరు గురించి 'ఇంట‌ర్నెట్ ఇన్ ఇండియా 2017' పేరిట ఇంట‌ర్నెట్ అసోషియేష‌న్ ఆఫ్ ఇండియా మ‌రియు ఐఎమ్ఆర్బీ సంయుక్తంగా ఒక నివేదిక రూపొందిచాయి. మొత్తం జ‌నాభాలో డిసెంబ‌ర్,2017 నాటికి 35% మంది ఇంట‌ర్నెట్ వాడుతున్నారు.


ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో డిసెంబ‌రు,2016తో పోల్చి చూస్తే ఏడాది కాలంలో 9.66% పెరుగుద‌ల‌తో 29.5 కోట్ల మంది ఇంట‌ర్నెట్ వాడ‌కందారులు ఉన్న‌ట్లు తెలిసింది. మ‌రో వైపు గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబ‌రు,2016తో పోలిస్తే 14.11% వృద్దితో డిసెంబ‌ర్,2017 నాటికి ఇంటర్నెట్ వినియోగ‌దారులు 18.6 కోట్లుగా ఉన్నారు. ప‌ల్లె ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ వాడ‌కందారుల సంఖ్య‌లో వృద్ది బాగా ఉన్న‌ప్ప‌టికీ మొత్తంగా చూస్తే గ్రామీణుల్లో ఇంట‌ర్నెట్ వాడే వారి సంఖ్య చాలా త‌క్కువగా క‌న‌బ‌డుతోంది. గ‌త డిసెంబ‌ర్ నాటికి మొత్తం ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ వ్యాప్తి 64.8%గా ఉండ‌గా, 2016 డిసెంబ‌ర్ నాడు అది 60.6%గా మాత్ర‌మే ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల విష‌యానికి వ‌చ్చే స‌రికి 2016 డిసెంబ‌ర్ నెల‌లో 18% నుంచి గ‌తేడాది డిసెంబ‌రు నాటికి 20.26% వృద్ది న‌మోద‌యింది. ఇంటర్నెట్ వ్యాప్తి విష‌యం గురించి లోతుగా విశ్లేషిస్తే గ్రామీణ‌-ప‌ట్ట‌ణ ప్రాంతాల మ‌ధ్య వ్య‌త్యాసం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇంకా త‌ర‌చూ ఇంట‌ర్నెట్ వాడేవాళ్ల సంఖ్య 28.1 కోట్లుండ‌గా అందులో 62% అంటే 18.29 కోట్ల మంది ప‌ట్ట‌ణ వాసులే. అదే గ్రామీణ ప్రాంతాల్లో ప్ర‌తి రోజు ఇంట‌ర్నెట్ వాడుతున్న వారు 9.80 కోట్ల మంది మాత్ర‌మే ఉన్నారు.


అంటే భవిష్య‌త్తులో ఇంట‌ర్నెట్ వాడ‌కం బాగా పెర‌గాలంటే ప్ర‌భుత్వాలు గ్రామీణ ప్రాంతాల‌పై దృష్టి సారించాల్సిన విష‌యం అర్థం అవుతోంది. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ వాడ‌కం అభివృద్ది చెందిన దేశాల‌తో దీటుగా ఉంటోంది. ప‌ట్ట‌ణ‌,న‌గ‌ర ప్రాంతాల్లో దాదాపు 45.5 కోట్ల మంది నివసిస్తున్న‌ట్లు అంచ‌నా ఉండ‌గా 29.5 కోట్ల మంది ఇంట‌ర్నెట్ వాడుతున్నారు. అదే గ్రామీణ ప్రాంతాలకు వ‌చ్చే స‌రికి 91.8 కోట్ల మంది జ‌నాభా ఉండ‌గా కేవ‌లం 18.6 కోట్ల మంది మాత్ర‌మే ఇంట‌ర్నెట్ వినియోగిస్తున్నారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో 73.2 కోట్ల మందికి ఇంకా ఇంట‌ర్నెట్ చేరువ కావాల్సి ఉంది










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com