ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రాష్ట్ర ఎమ్మెల్సీల బృందం శుక్ర, శనివారాల్లో వెళ్లనున్నది. 23న ఉదయం రెండు బస్సుల్లో ఎమ్మెల్సీలు మండలి ప్రాంగణం నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం 3.30 కి మేడిగడ్డ బరాజ్ చేరుకొంటారు. సాయంత్రం గం. 5.15 కి కాళేశ్వరానికి సమీపంలో ఉన్న కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శిస్తారు. రాత్రి కాళేశ్వరం సమీపంలోని హరిత గెస్ట్హౌస్లో బసచేస్తారు. మర్నాడు ఉదయం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం సందర్శిస్తారు. అనంతరం అన్నారం బరాజ్, మధ్యాహ్నం సుందిళ్ల బరాజ్ను సందర్శిస్తారు. లంచ్ అనంతరం మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ఎమ్మెల్సీలు.. గౌలివాడ వద్ద సుందిళ్ల పంప్హౌజ్ను సందర్శిస్తారు. సాయంత్రం ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ప్యాకేజ్-6, పంప్హౌస్, సర్జ్పూల్, టన్నెల్ను సందర్శిస్తారు. రాత్రి 8 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం 40 మంది ఎమ్మెల్సీలను మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ ఆహ్వానించినట్టు అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వేదాంత నరసింహాచార్యులు తెలిపారు.