ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమల్‌కు ఆయన రాజకీయ అండగా నిలుస్తారట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 22, 2018, 10:58 AM

తాను రాజకీయాల్లో వస్తున్నట్లు గతంలో ప్రకటించిన విలక్షణ నటుడు కమల్‌హాసన్ దీనికి అనుగుణంగా మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పేరుతో పార్టీని బుధవారం నాడు ప్రారంభించిన విషయం తెలిసిందే. మధురైలో జరిగిన ఈ ఆవిర్భావ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమల్‌కు తాను రాజకీయ అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. 70 స్థానాలున్న ఢిల్లీ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో 67 చోట్ల ఆప్ గెలుపొంది రికార్డుస్థాయి విజయం సాధించిందని, తమ పార్టీ నెలకొల్పిన ఈ రికార్డులను బద్దలుగొట్టే శక్తి ఒక్క కమల్‌హాసన్‌కు మాత్రమే ఉందని అన్నారు.


దీనికి తమిళ ప్రజలందరూ సహకరించాలని కేజ్రీవాల్ కోరారు. కమల్ ఓ నిజమైన హీరో అని, తమిళ ప్రజలకు ఆయనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభమే ఒకప్పుడు ఢిల్లీలోనూ కనిపించిందని అన్నారు. అప్పట్లో రాజధాని ప్రజలు ప్రత్యామ్నాయంగా మమ్మల్ని ఎన్నుకున్నట్టే, తమిళులు కూడా అదే పని చేస్తారని తాను నమ్ముతున్నానని జోస్యం చెప్పారు. కమల్ నీతిమంతుడని, ఆయనకు గొప్ప దూరదృష్టి ఉందని, తన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నానని పొగడ్తలతో ముంచెత్తారు.


అన్యాయం, మత శక్తులకు వ్యతిరేకంగా గళమెత్తడానికి కమల్ వెనుకాడరని కితాబిచ్చిన కేజ్రీవాల్, తాను ఆయనకు వీరాభిమానినని తెలియజేశారు. దశాబ్దాలుగా తమిళనాడులో రాజకీయ అంతరం కొనసాగుతోందని పరోక్షంగా డీఎంకే, అన్నాడీఎంకేలను విమర్శించిన కేజ్రీవాల్, తమిళ ప్రజలకు కమల్ ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై సామాజిక మాధ్యమాల వేదికగా కమల్ విమర్శలు గుప్పించారు. అనేక మంది మంత్రులు, అన్నాడీఎంకే నేతలను తన ట్వీట్ల ద్వారా ఏకిపారేశారు. ఈ సమయంలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com