న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ను సమీక్షించేందుకు ఆ రాష్ట్ర పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్పై .. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా దుమారం లేపింది. సీఎం కేజ్రీవాల్ ఇంట్లోనే సీఎస్పై ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి, వారిని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు, ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీ ఇంట్లో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించేందుకు ఇవాళ ఢిల్లీ పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. దాడి ఘటన పట్ల సీఎం కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పేంంత వరకు ఆ రాష్ట్ర మంత్రులు చేపట్టే కార్యక్రమాలకు హాజరుకాబోమని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.