న్యూఢిల్లి : కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సాగునీరు, తాగునీరు అందించే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీనికి పర్యావరణ అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా కోర్టు స్పందించింది. చెన్నై బెంచ్ నుంచి ఢిల్లీకి ఎందుకు వచ్చారని పిటిషనర్ను కోర్టు ప్రశ్నించింది. ఫోరం హంటింగ్ చేస్తున్నారా అంటూ పిటిషనర్ను మందలించింది. కేసు దాఖలులోనే ఆలస్యం చేశారని కోర్టు పేర్కొంది. ఒక చోట కాకపోతే మరో చోటికి వస్తారా అంటూ చురకలంటించింది. కేసు విచారణకు అర్హం కాదంటూ, పిటిషనర్ ఆలోచన సరిగా లేదంటూ.. పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.