ఆర్టీసీని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ లో రూ. 1000 కోట్లు కేటాయించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి. మహేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్టీసీ కార్మికుల సౌకర్యార్ధం డిపోలలో విశ్రాంతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో రెండేళ్లలో ఆర్టీసీ డిపోలలో మౌలిక సదుపాయాలకు రూ. 135 కోట్ల నిధులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కాగా... రాష్ట్రంలో మొత్తం 97 డిపోలు ఉండగా ప్రస్తుతం 27 డిపోలు లాభాల్లో ఉండగా మరో 63 డిపోల్లో గణనీయంగా నష్టాలు తగ్గాయన్నారు. అలాగే యాదాద్రి డిపోకు సీఎం కేసీఆర్ నిర్ధేశించిన విధంగా అదనంగా మరో 15 ఎకరాల స్థలం, 25 కొత్త బస్సు లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రోడ్లు లేక ప్రజా రవాణా వ్యవస్థకు నోచుకోని 920 వరకు గ్రామాలకు రానున్న రోజుల్లో రోడ్లు వేయించి బస్సు సదుపాయాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.