హైదరాబాద్: 2019 ఎన్నికల్లో తన స్టాండ్ ఏంటో చెబుతానని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ… గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. 2014లో నన్ను వాడుకుని వదిలేశారనే భావిస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు నన్ను రాజకీయాల్లో చిన్నపిల్లవాడిననుకుంటున్నాయేమోనన్నారు. జనసేన ఇంకా ఎన్డీఏలో ఉందని అనుకుంటున్నారా..? ఎన్డీఏలో ఉన్నామో లేదో నాకుతెలియదన్నారు. కేంద్రమంత్రులు ఇప్పుడు రాజీనామా చేసి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. మాఫియా వాళ్లు మాట ఇస్తే నిలబడతారని, కానీ పొలిటిషియన్లు మాత్రం మాటపై నిలబడరన్నారు. తాను చాలా ప్రాక్టికల్గా ఉంటానని, సీఎం అభ్యర్థిని అని ఎలా చెబుతానన్నారు. ఈ నెల 14న అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. థర్డ్ ఫ్రంట్ అధికారం కోసమే అని అందరూ అనుకుంటున్నారని, థర్డ్ ఫ్రంట్ అధికారం కోసం కాదని అన్నారు. స్వతంత్రంగా వ్యవహరించేందుకు థర్డ్ ఫ్రంట్ అవసరమన్నారు. దక్షిణాది నుంచే కాకుండా జిగ్నేష్ లాంటి వాళ్లు కూడా కలిసొస్తారని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్ల, తెలంగాణ ఉద్యమం తరహాలో జరగాలని అన్నారు.ప్రజల భాగస్వామ్యం లేకుండా పార్టీలు ఉద్యమం చేస్తున్నాయన్నారు. హోదా ఉద్యమానికి జేఏసీ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి నేతలంతా పార్టీలకు అతీతంగా కలిసిరావాలన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేయకుంటే సౌత్, నార్త్ల మధ్య తేడాలొస్తాయని ప్రధాని మోడీతో చెప్పానని అన్నారు. ఇలాగే కొనసాగితే మరో 20ఏళ్లలో ద్రవిడ ఉద్యమం మళ్లి వస్తుందని ప్రధానితో చెప్పానన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే అభివృద్ధి చేయలేదని ఏపీ సర్కార్ అంటోందని, ఇచ్చిన వాటికి లెక్కలు చెప్పనందునే నిధులు నిలిపామని కేంద్రం అంటోందని పేర్కొన్నారు. బలమైన వ్యక్తి ఏదైనా చేస్తారనే ప్రధాని మోడీకి తాను సపోర్ట్ చేశానని… కానీ ఈ రోజు తాను డిసప్పాయింట్ అయ్యానని అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పడం మంచిదేనన్నారు. తప్పు చేశామనే భావన కాంగ్రెస్లో వచ్చిందనుకుంటున్నానని పేర్కొన్నారు. కేంద్రంతో గొడవలు పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకనుకోవాలి అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa