ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగాలాండ్‌ సీఎంగా రియో ప్రమాణస్వీకారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 01:50 PM

నాగాలాండ్‌లో భాజపా సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‘నేషనల్‌ డెమోక్రటిక్‌-ప్రోగ్రెసివ్‌ పార్టీ (ఎన్‌డీపీపీ)’ సీనియర్‌ నేత నెయిఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కోహిమాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ పి.బి. ఆచార్య ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్‌ రిజిజు, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌లతో పాటు మణిపూర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీరెన్‌ సింగ్‌, పెమా ఖండూ, శర్వానంద సోనోవల్‌, కాన్రాడ్‌ సంగ్మా కూడా హాజరయ్యారు.


గత శనివారం నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించలేకపోయింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో భాజపా, స్వతంత్రుల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్‌డీపీపీ ముందుకొచ్చింది. 18 మంది శాసనసభ్యులున్న ఎన్‌డీపీపీకి భాజపాకు చెందిన 12 మంది, జేడీయూ నుంచి ఒకరు, ఎన్‌పీపీ నుంచి ఇద్దరు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలికారు. మెజార్టీ ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు రియోను గవర్నర్‌ ఆచార్య ఆహ్వానించారు. దీంతో నేడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 16వ తేదీలోగా రియో.. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa