ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కలిసి మాట్లాడడానికి సమయం ఇవ్వాలని కోరుతూ ఆయన వారికి లేఖలు పంపించారు. రాజధాని దిల్లీ నగరంలో సీజ్ చేసిన దుకాణాల సమస్యపై మాట్లాడేందుకు కేజ్రీవాల్ వారిని కలవాలనుకుంటున్నారు. నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్లను సీజ్ చేయడానికి కారణమైన చట్టంలో మార్పులు చేయాలని కేజ్రీవాల్ మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దుకాణాలు మూసేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇది శాంతి భద్రతలకు కూడా సమస్యగా మారుతుందని తెలిపారు. మార్చి 31లోగా దుకాణాల సీజ్ను నిలిపేయకపోతే తాను నిరాహార దీక్షకు దిగుతానని నిన్న కేజ్రీవాల్ హెచ్చరించారు.
వ్యాపారులు నిజాయితీగా వ్యాపారం చేసుకుని, పన్నులు కడుతున్నారని.. ఒక్కో దుకాణం కొందరికి జీవనాధారం కల్పిస్తోందని కేజ్రీవాల్ తెలిపారు. వారంతా నిరుద్యోగులు అయ్యారని వెల్లడించారు. దుకాణాలు సీజ్ చెయ్యకుండా పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన మోదీని కోరారు. దీనిపై మాట్లాడడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని అడిగారు. ఈ విషయంపై పార్లమెంటులో బలమైన వాదన వినిపించాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాహుల్కు కూడా కేజ్రీవాల్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ మార్గదర్శకాల మేరకు గత ఏడాది డిసెంబరు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దుకాణాలను సీజ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa