ప్రజాస్వామ్యంలో నియంత పోకడలకు తావులేదని, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని టీపీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్ హెచ్చరించారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటనను సాకుగా చూపి ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి బహిష్కరించాలనే నిర్ణయం అనాగరికమన్నారు. ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మూర్ఖత్వమని విమర్శించారు.
ప్రతిపక్షాలను చులకన చేయడం, ధర్నాచౌక్లు ఎత్తివేయడం నియంత పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. నక్సల్స్ ఎజెండా అంటూనే రక్తపుటేరులు పారిస్తున్నారని.. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. చెర్ల పద్మ, దిండిగాల మధు, బాశెట్టి కిషన్, మాదాసు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వీరారెడ్డి, సాయికృష్ణ, వంగల విద్యాసాగర్ పాల్గొన్నారు.
నిరంకుశ చర్య: మాజీ ఎంపీ పొన్నం
బడ్జెట్ సమావేశాల నుంచి కాంగ్రెస్ సభ్యులను బహిష్కరించడం ప్రభుత్వ నిరంకుశ చర్యకు నిదర్శనమని టీపీసీసీ ఉపా«ధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హెడ్ఫోన్ విసిరిన సంఘటనను సాకుగా చూపి ఇద్దరి ఎమ్మెల్యే సభ్యత్వాలు రద్దు చేయడం, 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమన్నారు.