కలిసి చదువుకున్న చనువుతో వివాహితను బెదిరించి డబ్బులు గుంజడమే కాకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిపై షీటీమ్ పోలీసులు నిర్భయ చట్టం ప్రయోగించారు. మీర్పేట సీఐ మన్మోహన్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన రెడ్డిపోగు రవి(31) గతంలో నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తిలో పదో తరగతి చదివాడు. ఆ సమయంలో అదే పాఠశాలలో చదువుతున్న బాలికతో చనువుగా ఉండేందుకు ప్రయత్నించగా నిరాకరించింది. 2014లో కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేశారు.
ప్రస్తుతం భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె బడంగ్పేట నగరపంచాయతీ పరిధిలో నివాసం ఉంటోంది. రవి 2017లో ఆమె ఫోన్ నెంబరు సంపాదించాడు. నాటి నుంచి ఆమెకు ప్రతిరోజు ఫోన్ చేసి తనతో తరచూ ఫోన్లో మాట్లాడాలని వేధించడం మొదలుపెట్టాడు. పదో తరగతి చదివే సమయంలో ఆమెకు తెలియకుండా తీసిన నగ్న ఫొటోలను ఆమె సెల్ఫోన్కు పంపించాడు. తన దగ్గర మరిన్ని ఫొటోలు ఉన్నాయని వాటిని నీ భర్తకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో దిక్కుతోచని ఆమె అతని ఫోన్ నెంబరు బ్లాక్ చేసింది. అతను మరో ఫోన్ నెంబరుతో వేధించడం మొదలు పెట్టాడు. తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె రవిని ప్రాధేయపడింది. కనికరించని రవి తనకు డబ్బులు ఇస్తే ఫొటోలు డిలీట్ చేస్తానని అన్నాడు. ఆమె తన భర్తకు తెలియకుండా రవికి రూ.2.50లక్షలు ఇచ్చింది. అయినా ఫొటోలు డిలీట్ చేయలేదు. అంతేగాక తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని లేకపోతే నీ భర్తను చంపి పిల్లలను కిడ్నాప్ చేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఏడాది జనవరి 18వ తేది కల్వకుర్తిలోని హనుమాన్ దేవాలయం వద్దకు వస్తే నీకు సంబంధించిన నగ్న ఫొటోలన్ని నీముందే సెల్ఫోన్లో డిలీట్ చేస్తానని నమ్మబలికాడు.
అతని మాటలు నమ్మి ఆమె చెప్పిన సమయానికి అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను కొట్టి బలవంతంగా అత్యాచారానికి పాల్పడినట్లు సీఐ మన్మోహన్ వివరించారు. వేధింపులతో విసిగివేసారిన బాధితురాలు చివరికి షీ బృందాన్ని ఆశ్రయించింది. షీటీమ్ అడిషనల్ డీసీపీ సలీమా, వనస్థలిపురం ఏసీపీ రవీందర్రెడ్డి పర్యవేక్షణలో మీర్పేట సీఐ మన్మోహన్, ఎస్సైలు మైబెల్లి, మసియుద్దీన్ బృందం రంగంలోకి దిగి నిందితుడు రవిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి ఒక ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.