హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం తెచ్చి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కొనియాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ సాధించడం ఎంత గొప్ప చరిత్రనో.. తెలంగాణను అభివృద్ధి చేసి.. అంత కన్నా గొప్ప చరిత్రను సీఎం కేసీఆర్ సృష్టించాలన్నారు. తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. పారిశ్రామిక రంగంలో యువ మంత్రి కేటీఆర్ బాగా చొరవ చూపుతున్నారని ప్రశంసించారు. పారిశ్రామిక రంగంలో మనకున్న వనరులను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధి కోసం ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రిజర్వేషన్ల కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పోరాడటం అభినందనీయం, మద్దతు కూడా తెలుపుతున్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఎస్టీ రిజర్వేషన్లను ఒక జీవో ద్వారా రాష్ట్రం పెంచుకునే అవకాశం ఉందన్నారు. దీనిపై అధికారులతో చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గ్రూప్ 4 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. బీసీల కోసం సీఎం జరిపిన చర్చలు చరిత్రాత్మకం. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సీఎంను కృష్ణయ్య కోరారు.