న్యూఢిల్లి : రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో జోక్యం కోరుతూ బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనితోపాటు ఈ కేసులో జోక్యం కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో అసలైన పార్టీల పిటిషన్లను మాత్రమే విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసుతో సంబంధం లేని వారి పిటిషన్లను తిరస్కరిస్తామని చెప్పిన సుప్రీంకోర్టుమొత్తం 32 పిటిషన్లను తిరస్కరించింది. వీటిలో అపర్ణా సేన్, శ్యామ్ బెనగల్, తీస్తా సెతల్వాద్ తదితరుల పిటిషన్లు ఉన్నాయి. అయోధ్యలోని 2.7 ఎకరాల వివాదాస్పద స్థలానికి సంబంధించిన 13 పిటిషన్లను తుది విచారణకు చేపట్టింది.