ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టతకు చర్యలు: ఈటల

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 15, 2018, 12:28 PM

హైదరాబాద్: అభివృద్ధి ఎప్పుడైనా పునాదుల నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శాసనసభలో బడ్జెట్ ప్రవేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరీకరణను మాత్రమే అభివృద్ధి అనుకుంటాము. అది తప్పు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నది. వ్యవసాయాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూనే వ్యవసాయ అనుబంధ రంగాలకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ వృత్తుల మీద ఆధారపడిన వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా గొల్ల కురుమల సంప్రదాయ వృత్తి గొర్రెల పెంపకానికి సంబంధించి మొదటిదశలో 4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2 లక్షల 35 వేల కుటుంబాలకు 75 శాతం సబ్సిడీపై 50 లక్షల గొర్రెలను పంపిణీ చేశాం. గంగపుత్ర, ముదిరాజ్, బోయ, బంటు కులస్తులు చేపలు పట్టడమే వృత్తిగా జీవిస్తున్నారు. వీరి సంక్షేమంలో భాగంగా ప్రతీ సంవత్సరం 3,20,000 టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. పట్టిన చేపలు అమ్ముకోవడానికి వీలుగా జిల్లాకు ఒకటి చొప్పున 31 హోల్‌సేల్ చేపల మార్కెట్‌లు, 200 రిటైల్ మార్కెట్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ పరిశ్రమ మీద ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 109 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa