కొలంబో: నిదహాస్ ట్రోఫీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించింది. టీ20లోని అసలైన మజాను పంచిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. చివరికి ఇన్నింగ్స్ చివరి బంతిని దినేశ్ కార్తీక్ సిక్సర్గా మలిచి భారత్కు ట్రోఫీని అందించాడు. ఫలితంగా దినేశ్ కార్తీక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో చివరి బంతిని సిక్సర్గా మలిచి విజయాన్ని అందించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్లో మొత్తం 8 బంతులు ఎదుర్కొన్న దినేశ్ కార్తీక్ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 362.5 సగటుతో 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివరి బంతికి ఐదు పరుగులు కావాల్సిన తరుణంలో సిక్సర్ కొట్టి భారత్ను గెలిపించిన కార్తీక్పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. కార్తీక్ కొట్టిన చివరి సిక్సర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.