ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు తప్పనిసరి చేస్తూ సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 21, 2018, 09:08 AM

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగు భాషను తప్పనిసరి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రావాలని తెలిపారు. తమిళనాడులో మాతృభాషలో బోధనా విధానాన్ని అధ్యయనం చేసి వచ్చిన అధికారులతో మంగళవారం (మార్చి 20) కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించడంపై రూపొందించాల్సిన విధివిధానాలపై అధికారులతో చర్చించారు. మాతృభాషను బతికించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటామని గత డిసెంబర్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం ప్రకటించారు. 


అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అధికారులకు కేసీఆర్ సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో తప్పనిసరిగా తెలుగు పండితుడు ఉండాలని పేర్కొన్నారు. దీనిపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తున్నట్లు తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో చదివే విద్యార్థులు కూడా తెలుగు భాష నేర్చుకోవాలనే నిబంధన పెడుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. మొదటి దశలో పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలుగు సబ్జెక్ట్‌కు సిలబస్ రూపొందించాలని తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య అకాడమీని కోరారు. సిలబస్‌లో నైతిక విలువలు, దేశభక్తి పెంపు అంశాలు ఉండాలని సూచించారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa