రహదారిపై ఐదు, పది రూపాయలు దొరికినా గుట్టుచప్పుడు కాకుండా జేబులో వేసుకొని వెళ్లిపోయే రోజులివి. అలాంటిది చెత్తకుప్పలో ఏకంగా లక్ష రూపాయలు కనిసిస్తే ఎవరైనా ఊరుకుంటారా? కానీ, ఓ పారిశుద్ధ్య కార్మికురాలు అసమాన నిజాయతీని ప్రదర్శించి అందరి మన్ననలనూ అందుకుంటోంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.మద్దెల లక్ష్మి అనే కార్మికురాలు మెట్పల్లి కూరగాయల మార్కెట్లో చెత్త ఊడుస్తుండగా.. ఓ ప్లాస్టిక్ కవరు కనిపించింది. ఆసక్తిగా పరిశీలించగా అందులో లక్ష రూపాయల నగదు ఉంది. దీంతో ఆ డబ్బులను ఆమె జాగ్రత్తగా దాచిపెట్టింది. ఉదయం మార్కెట్లోకి వచ్చి చూడగా ఓ చికెన్ సెంటర్ యజమాని జావేద్ దేని కోసమో ఆదుర్దాగా వెతుకుతున్నాడు.
లక్ష్మి అక్కడికి వెళ్లి విషయం ఆరా తీసింది. అసలు విషయం తెలుసుకొని ఆ డబ్బును అతడికి అప్పగించడంతో.. జావేద్ ఆశ్చర్యపోయాడు. లక్ష్మి నిజాయతీకి మెచ్చుకొని రూ.5000 ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. దొరికిన డబ్బును నిజాయతీగా యజమానికి అందించిన కార్మికురాలు లక్ష్మీని అక్కడున్న వారంతా అభినందించారు.
‘మంగళవారం రాత్రి షాప్ మూసేసే సమయంలో ఓ కవర్లో చెత్త, మరో కవర్లో డబ్బులను తీసుకొని బైక్పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలో చెత్త కవరుకు బదులు డబ్బులున్న కవరును చెత్తకుప్పలో పడేశాను. ఉదయం నిద్ర లేచాక అసలు విషయం తెలియడంతో చెత్త కుప్ప వద్దకు వచ్చి వెతకడం ప్రారంభించా. అదే సమయంలో లక్ష్మి అక్కడికి వచ్చి డబ్బులు అందజేసింది’ అని చెబుతూ జావేద్ ఆనందం వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa