ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వానకాలం పంటల బీమా టెండర్లు ఖరారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 10:42 AM

వచ్చే వానకాలం సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు మూడు బీమా కంపెనీలను వ్యవసాయశాఖ ఎంపిక చేసింది. ఇం దులో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎన్‌ఐసీ), వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), టాటా బీమా కంపెనీలు ఉన్నాయి. మొత్తం 13 బీమా కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొనగా.. టెండర్లు తక్కువ (ఎల్1) ప్రీమియం రేట్లను కోట్‌చేసిన మూడు కంపెనీలను ఎంపికచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ప్రీమియం రేటు కాస్త పెరిగినట్లు సమాచారం. పత్తి, వరికి క్లెయిమ్స్ అధిక మొత్తంలో చెల్లిస్తున్నందున ఈ పంటలకు ఎక్కువ ప్రీమియం రేటును కంపెనీలు కోట్ చేసినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం వీటిని అధికారికంగా ప్రకటించలేదు. ఏటా మే, జూన్‌లో పంటల బీమా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. కేంద్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు ఎక్కువ మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఈసారి ముందస్తుగానే వ్యవసాయశాఖ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రాన్ని ఆరు క్లస్టర్లుగా విభజించి పంటల బీమా అమలు చేస్తున్నారు. క్లస్టర్-1లో ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. క్లస్టర్-2లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి జిల్లాలు, క్లస్టర్-3లో పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, జనగామ, క్లస్టర్-4లో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు, క్లస్టర్-5లో భద్రాద్రి, వరంగల్(అర్బన్), వరంగల్ (రూరల్), వనపర్తి జిల్లాలు, క్లస్టర్-6లో మేడ్చల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. వీటిలో ఒకటి, రెండు, ఆరు క్లస్టర్లలో పంటల బీమా అమలును ఎన్‌ఐసీ దక్కించుకున్నది. నాలుగు, ఐదు క్లస్టర్లలో ఏఐసీ, మూడో పరిధిలో టాటా కంపెనీ పంటల బీమా అమలు చేయనున్నది. 


 


బీమా కంపెనీలు ప్రీమియం పెంచడం వల్ల రైతులపై ఎటువంటి ప్రభావం లేకున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థికభారం పడుతుంది. వానకాలం ఆహార ధాన్యాల పంటలకు రైతులు రెండు శాతం ప్రీమియాన్ని చెల్లించాలి. పత్తి, మిర్చి సహా ఇతర వాణిజ్య, వాతావరణ ఆధారిత పంటలకు 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించాలి. అయితే జిల్లాలను, అక్కడి వాతావరణ పరిస్థితుల ఆధారంగా ప్రీమియం రేటు మారుతుందని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు పథకాల్లో బీమా కంపెనీలు కోట్ చేసే అదనపు సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2017 వానకాలంలో 8.60 లక్షల మంది రైతులు, యాసంగిలో 1.60 లక్షల మంది రైతులు పంటల బీమా కింద నమోదైనట్లు అధికారుల ద్వారా తెలిసింది. ఈసారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa