నోట్లరద్దు, జీఎస్టీపైలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన విమర్శలకు మరింత పదును పెట్టారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాలే భారత ఆర్ధిక అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాలకు పెను శాపంగా మారాయని దుయ్యబట్టారు. మైసూరులోని మహారాణి మహిళా ఆర్ట్స్ కాలేజి విద్యార్ధులతో ఇవాళ ఆయన మాట్లాడుతూ... ‘‘నోట్లరద్దు ఓ తప్పుడు నిర్ణయం... ఇది జరిగి ఉండాల్సిందికాదు. నోట్లరద్దు, జీఎస్టీ నిర్ణయాలు భారత ఆర్ధిక వ్యవస్థకు, ఉద్యోగ అవకాశాలకు తీవ్ర నష్టం తీసుకొచ్చాయి. నోట్లరద్దు అమలు చేసిన తీరు కూడా నన్ను కలవరానికి గురిచేసింది. అర్బీఐ గవర్నర్, ఆర్ధిక సలహాదారు మొదలు కనీసం ఆర్ధిక మంత్రికి కూడా నోట్ల రద్దు విషయం తెలియదు. అప్పుడు నేను చిదంబరం (కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి)కి ఫోన్ చేస్తే... నోట్లరద్దు ఓ మతిలేని చర్య అని చెప్పారు...’’ అని రాహుల్ వివరించారు.
వేలాది కోట్ల రూపాయల పీఎన్బీ కుంభకోణం పైనా రాహుల్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ‘‘నీరవ్ మోదీ మొత్తం రూ.22 వేల కోట్ల బ్యాంకు సొమ్ము పట్టుకుపోయాడు. అదే రూ.22 వేల కోట్లు మీలాంటి ఔత్సాహిక యువతులకు ఇచ్చి ఉంటే ఎన్ని వ్యాపారాలు నిర్మించి ఉండేవాళ్లో ఊహించుకోండి..’’ అని ఆయన పేర్కొన్నారు. ఆర్ధికంగా బలంగా ఎదుగుతున్నప్పటికీ.. ఉద్యోగాల కల్పనలో మాత్రం దేశం దారుణంగా వెనుబడిందన్నారు. నైపుణ్యం ఉన్న వారికి ఆర్ధిక సహకారం, తోడ్పాటు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. అత్యధిక మొత్తంలో సొమ్ములన్నీ కేవలం 15 నుంచి 20 మంది చేతుల్లోకే పోవడం వల్లే సమస్య తలెత్తుతోందన్నారు.