హైదరాబాద్ : నాగర్కర్నూల్ జిల్లాలో మార్చి నెలలో కూడా చెరువులు మత్తడి పోస్తున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్ధన్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గంలోని చంద్రసాగర్ కాల్వను తవ్వాలన్న ప్రతిపాదన ఉందన్నారు. చంద్రసాగర్ లిఫ్ట్ పెట్టి అమ్రాబాద్కు నీళ్లు ఇస్తాం. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించే విషయం పరిశీల్తిన్నామని తెలిపారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించి డీపీఆర్ తుది దశలో ఉందన్నారు. ఉప్పునూతల, అచ్చంపేట మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందిస్తామన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో వీలైనచోట్ల చెక్ డ్యామ్ల ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. జల విజయయాత్ర పేరిట మర్రి జనార్ధన్రెడ్డి పాదయాత్ర చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఆయన కృషి ఎనలేనిది అని తెలిపారు. మార్చిలో కూడా నాగర్కర్నూల్ జిల్లాలో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి కొదవలేదని రైతులు అంటున్నారని మంత్రి తెలిపారు. సింగూరు ప్రాజెక్టు కింద అందోల్, పుల్కల్ మండలాల్లో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. పటాన్చెరు, ఆర్సీపురం పరిధిలో ఉండే కూలీలు 750 మంది మళ్లీ తమ సొంత గ్రామాలకు వచ్చి ఇక్కడే రేషన్కార్డులు ఇస్తే వ్యవసాయం చేసుకుంటామని దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో వలసపోయిన ప్రజలు వాపస్ వస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తే కిషన్రెడ్డి తట్టుకోలేకపోతున్నాడని మంత్రి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు కోర్టులు, ట్రిబ్యునళ్లలో పిటిషన్లు వేస్తున్నారని మంత్రి హరీష్రావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa