ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాల్ ట్యాంపరింగ్ ఒత్తిడిలో చిత్తుగా ఓడిన ఆసీస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 26, 2018, 09:23 AM

కెప్‌టౌన్ టెస్టులో ఆస్ట్రేలియా 322 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆసీస్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు. మోర్నీ మోర్కెల్ ఐదు వికెట్లు కూల్చడంతో కంగారూలు 107 పరుగులకే చాప చుట్టేశారు. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (26), డేవిడ్ వార్నర్ (32) 20.1 ఓవర్లలో తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించగా.. ఆసీస్ జట్టు తదుపరి 19.4 ఓవర్లలో 50 పరుగులు మాత్రమే జోడించి మిగతా 9 వికెట్లను కోల్పోయింది.


బాల్ ట్యాంపరింగ్ వివాదం మధ్య నాలుగో రోజు ఆస్ట్రేలియాకు వికెట్ కీపర్ టిమ్ పెయిన్ సారథ్యం వహించాడు. ఐదు వికెట్ల నష్టానికి 238 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 373 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌కు 430 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కెప్టెన్ డుప్లెసిస్ అద్భుతమైన త్రో ద్వారా బాన్‌క్రాఫ్ట్‌ను రనౌట్ చేయగా.. కాసేపటికే రబాడ వార్నర్‌ను అవుట్ చేశాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో వార్నర్ రబాడకే వికెట్ సమర్పించుకున్నాడు. వార్నర్ అవుయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ పేక మేడను తలపించింది. స్మిత్ కేవలం ఏడు పరుగులకే అవుటగా.. మిగతా బ్యాట్స్‌మెన్‌లో మిచెల్ మార్ష్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మోర్కెల్ 9 వికెట్లు పడగొట్టాడు.


దక్షిణాప్రికాకు పరుగుల తేడా పరంగా ఆస్ట్రేలియాపై ఇది రెండో అతిపెద్ద విజయం. 1970లో సఫారీ జట్టు 323 పరుగుల తేడాతో నెగ్గగా. కెప్‌టౌన్ టెస్టులో 322 పరుగుల తేడాతో డుప్లిసెస్ సేన విజయాన్ని అందుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్టు జొహెన్నస్‌బర్గ్ వేదికగా శుక్రవారం ప్రారంభం అవుతుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa