బంజారాహిల్స్ : తనను పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదన్న కక్షతో యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం.12 బోళానగర్లో నివాసం ఉంటున్న సమియా ఫాతిమా(18) 10వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. అర్ధరాత్రి ఇంట్లో పడుకున్న సమియా ఫాతిమా వద్దకు నలుగురు యువకులు వచ్చి దాడికి దిగారు. వారిలో ఒకరు కత్తితో సమియాపై దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. దీంతో బాధితురాలి తల్లి సయాదా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని ఉస్మానియా దవాఖా నకు తరలించారు. ఫాతిమా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా... బాధితురాలి తల్లి సయీదా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. గతంలో పాతబస్తీలోని బహుదూర్పురాలో నివాసం ఉన్న సమయంలో అబ్బాస్ అనే యువకుడు సమియాను ప్రేమించాడని, వారిద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారని తేలింది. తాగుడుకు బానిసైన తనను పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో కక్ష పెంచుకున్న అబ్బాస్ స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa