ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫెడరల్ ఫ్రంట్: కేసీఆర్‌తో జార్ఖండ్ మాజీ సీఎం భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 29, 2018, 09:06 AM

దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కూటమిలకు ప్రత్యామ్నాయంగా కేసీఆర్ ప్రతిపాదించిన ‘పీపుల్స్ ఫెడరల్ ఫ్రంట్’కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే కొంత మంది కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు తెలపగా.. మరికొంత మంది ప్రత్యక్షంగా కలిసి మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదే కోవలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సీఎం కేసీఆర్‌ను కలిశారు. బుధవారం (మార్చి 28) హేమంత్ సోరెన్ తన కుటుంబసభ్యులతో పాటు ప్రగతి భవన్‌కు విచ్చేశారు. ఇరువురు కలిసి లంచ్ చేసిన తర్వాత ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. 


భేటీ అనంతరం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధితో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంటుందని చెప్పారు. ‘బీజేపీ బురద రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆ పార్టీ తీరుతో విసుగు చెందిన ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు ప్రమాదకరం’ అని సోరెన్ అన్నారు.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా మరింత చొరవ తీసుకుంటామని హేమంత్ సోరెన్ తెలిపారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ దిశగా పలువురితో చర్చలు జరిపారని ఆయన చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏకం కావడానికి అనేక ప్రాంతీయ పార్టీలు ముందుకొస్తున్నాయని ఆయన తెలిపారు.


దేశంలో ఒక్కసారిగా రాజకీయ మార్పు సాధ్యమా అని టీవోఐ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సోరెన్ బదులిస్తూ.. ‘ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు. బీజేపీ తీరుతో చాలా పార్టీలు విసుగు చెందాయి. ప్రజల్లో నానాటికీ అసమ్మతి పెరుగుతోంది. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ ప్రకటన చేయగానే ఆ శక్తులన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి’ అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa