న్యూఢిల్లీ: ఆఫ్రికాకు సమీపంలో ప్రచండమైన గాలుల తీవ్రత కారణంగా సముద్రంలో భారీ అలలు ఏర్పడ్డాయి. ఇప్పటికే భారత పశ్చిమ తీరాన్ని సముద్రపు అలలు తాకాయి. మూడు నుంచి నాలుగు మీటర్ల మేరకు అలలు ఎగసిపడుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక తీరాల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకువస్తుంది. సముద్రపు అలల తాకిడికి కేరళలో వందకు పైగా ఇండ్లు ధ్వసమయ్యాయి. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల రిత్యా సముద్ర తీరంలో భారీగా అలలు ఎగసిపడే ప్రమాదం ఉందని ఇన్కాయిస్ సంస్థ తెలిపింది. ఈ నెల 26 వరకు సముద్రంలో భారీగా అలలు ఎగసిపడతాయని, సముద్ర తీరానికి దగ్గరగా నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్ర స్నానాలు, చేపలవేటను రెండ్రోలపాటు నిలిపివేయాలని హెచ్చరించింది.