జోధ్పూర్: ఒక బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపు కేసుపై జోధ్పూర్ కోర్టు బుధవారం తీర్పు చెప్పనున్నది. దీంతో రాజస్థాన్ పోలీసులు 378 మందిని అరెస్ట్ చేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా జోధ్పూర్ సెంట్రల్ జైలు పరిధిలో భద్రత పటిష్టం చేశారు. ఈ నెల 21 నుంచి 30 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రకటించారు. మరోవైపు భద్రత పటిష్టం చేయాలని రాజస్థాన్, గుజరాత్, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం మంగళవారం ఆదేశించింది. గత ఆగస్టులో పంచ్కులలో మాదిరిగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసుకోవాలని కేంద్రం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో జోధ్పూర్ నగరంలోని రెండు స్టేడియంలను తాత్కాలికంగా జైళ్లుగా మార్చివేశారు.
తన అభిమానులెవ్వరూ జోధ్పూర్ జైలు పరిసరాల్లో తచ్చాడరాదని ఆశారాం బాపు కోరారు. 2013లో ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ మైనర్ బాలిక (16) చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. ఆయనను అరెస్ట్ చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు బాధితురాలి కుటుంబానికి హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. బాధిత కుటుంబానికి కల్పించిన భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సహరాన్పూర్ ఎస్పీ కేబీ సింగ్ తెలిపారు. ఈ కేసు తీర్పు కవరేజీకి అనుమతించాలన్న మీడియా పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది.