తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ కావాల్సి ఉంది. ఉదయం 9.30 గంటలకు రాజ్నాథ్సింగ్తో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గవర్నర్ హైదరాబాద్ పయనమయ్యారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేర్వేరుగా సమావేశమైన గవర్నర్ తాజా పరిస్థితులపై చర్చించారు. దీనికి సంబంధించిన వివరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదించేందుకే దిల్లీ వెళ్లినట్లు సమాచారం.