వాంఖడే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ తన 45వ జన్మదిన వేడుకలను జరుపుకొన్నాడు. ఐపీఎల్లో భాగంగా మంగళవారం ముంబయిలోని వాంఖడే మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ - ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు సచిన్ కూడా మైదానానికి వచ్చాడు.
మంగళవారం(ఏప్రిల్ 24) సచిన్ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వాహకులు మైదానంలో సచిన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంటేటర్ సైమన్ డల్... సచిన్ చేత కేక్ కట్ చేయించాడు. ఆ సమయంలో స్టేడియం సచిన్ నామస్మరణతో హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ..‘ఈ రోజు ఎంతో ప్రత్యేకం. స్టేడియంలో ఏం జరుగుతుందో చూడండి. ఈ రోజు ఉదయం నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పలు ప్రాంతాల నుంచి అభిమానులు పెద్ద సంఖ్యలో నా ఇంటి ముందు నిల్చున్నారు. మా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడంతో ఈ రోజు నాకు మొదలైంది. ఆ తర్వాత నా కంపెనీ వెబ్సైట్ ఒకటి ప్రారంభించా. సాయంత్రం మేక్ ఎ విష్ ఫౌండేషన్ తరఫున క్యాన్సర్ పేషెంట్స్తో కొంత సమయం గడిపా. ఆ తర్వాత ఇక్కడికి వచ్చా’ అని చెప్పాడు.
ఈ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబయి విఫలమైంది.