రైతులకు, సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడాల్సిన రైతుబజార్లు దళారులు, బినామీ వ్యాపారులకు అడ్డాగా మారిన విషయం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న స్వరాజ్య మైదానంలోని రైతుబజార్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రైతు గుర్తింపు కార్డు లేకుండా పలువురు వ్యాపారులు ఇక్కడ దుకాణాలు నిర్వహిస్తున్నట్లు తేలింది. నిఘా అధికారుల రాకతో వారంతా సరుకు వదిలేసి పారిపోయారు. అలాగే తూకపు యంత్రాలు కూడా సరిగా పనిచేయటం లేదు. తూనికలు-కొలతల శాఖ అధీకృత గుర్తింపు లేని యంత్రాలను కొందరు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. మరికొందరైతే మంచి కూరగాయల్ని బయటి వ్యాపారులకు విక్రయించి.. . నాణ్యత లేని సరుకును సాధారణ ప్రజలకు అంటగడుతున్నారని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. నిఘా విభాగంతో పాటు మార్కెటింగ్, తూనికలు కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. సాధారణ వినియోగదారుల్లా రైతుబజార్లోకి వెళ్లి అక్రమాల నిగ్గు తేల్చారు. అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని... తరచుగా దాడులు కొనసాగిస్తామని విజిలెన్స్ డీఎస్పీ విలియం పాల్ తెలిపారు.