హైదరాబాద్: కర్ణాటకలో రాజకీయం రసకందాయంలో పడింది. నిన్న కర్ణాటకలో అధికారం చేపట్టిన భాజపా... బల నిరూపణ కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుండటంతో ఆ రెండు పార్టీలు అప్రమత్తమయ్యాయి. బెంగళూరు నగర శివారులోని ఈగల్టన్ రిసార్టులో బస చేసిన జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పోలీసులు గురువారం ఆకస్మికంగా భద్రత ఉపసంహరించుకున్నారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు భాజపా ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడకు పాల్పడిందని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపించాయి. అనంతరం రెండు పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముందుగా కేరళకు ప్రత్యేక విమానంలో తరలించాలని అనుకున్నాయి. అయితే పౌరవిమానయాన శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో ప్లాన్ మార్చారు. ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక బస్సుల్లో ఎక్కించి కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తరలించారు. అయితే వారందరినీ ఎక్కడికి తరలిస్తున్నారన్న దానిపై చివరి నిమిషం వరకు గోప్యత పాటించారు.