కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. గురువారం రాత్రి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్–జేడీఎస్ను కాదని ఆ రాష్ట్ర గవర్నర్ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించడం శోచనీయమన్నారు.
గవర్నర్ చర్య ప్రజాస్వామ్యానికి చీకటి రోజని అభివర్ణించారు. కర్ణాటక గవర్నర్ బీజేపీ చేతిలో కీలు బొమ్మగా మారారని ధ్వజమెత్తారు. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో శుక్రవారం కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలను చేపడుతుందన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో ని«శ్శబ్ద విప్లవం రాబోతోందని ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర బెల్లంపల్లితో కలుపుకొని 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిందన్నారు.