నాగర్కర్నూల్ : రైతుబంధు చెక్కుల పంపిణీ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులందరూ పండుగ చేసుకుంటున్నారు. కొల్లాపూర్ మండలంలోని చింతలపల్లి, పాన్గల్ మండలంలోని శాగాపూర్ గ్రామాల్లో రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుకు రైతులు ఎడ్ల బండ్ల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కూడా ఎడ్ల బండెక్కి ఆ గ్రామాల్లో పర్యటించారు. దేశంలోని విప్లవాత్మక పథకాల్లో రైతుబంధు పథకం ఒకటి అని మంత్రి జూపల్లి తెలిపారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. ఇలాంటి నేత తెలంగాణకు సీఎం కావడం మన అందరి అదృష్టమని జూపల్లి పేర్కొన్నారు.