ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరికలతో ఉత్తర కొరియా, అమెరికాల మధ్య జరగాల్సిన సమావేశం రద్దవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఏకపక్షంగా అణ్వాయుధాలు త్యజించాలని ఒత్తిడి తీసుకొస్తే అమెరికాతో సమావేశం రద్దు చేసుకుంటామని ఇటీవల కిమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందించారు. ఒకవేళ తాము అనుకున్నట్లుగా ఇరుదేశాల మధ్య సమావేశం జరగకపోతే తర్వాత తాము తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉత్తర కొరియా తీరులో మార్పు రావడంపై చైనాను ట్రంప్ నిందించారు. జూన్ 12న సింగపూర్లో ట్రంప్, కిమ్ల సమావేశానికి ఏర్పాట్లు చేస్తుండగా కిమ్ వ్యాఖ్యలతో దీనిపై సందిగ్ధత నెలకొంది. అమెరికా, దక్షిణ కొరియా కలిసి సైనిక విన్యాసాలు చేపట్టడం పట్ల ఉత్తర కొరియా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది.
‘ఏం జరుగుతుందో చూస్తాం. సమావేశం జరిగితే జరుగుతుంది. జరగకపోతే.. తర్వాత తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ముందుకెళ్తాం’ అని ట్రంప్ తన ఓవల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. కిమ్ జోంగ్ వైఖరిలో ఉన్నట్టుండి మార్పు రావడంపై విలేకరులు ట్రంప్ను ప్రశ్నించగా.. చైనా నాయకులను కలిసినప్పుడు కొన్ని విషయాలు అలా మారిపోతుంటాయి అని పేర్కొన్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్పై పరోక్ష విమర్శలు చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో అని ట్రంప్ అన్నారు. రెండు నెలల కంటే తక్కువ సమయంలో కిమ్, జిన్పింగ్లు రెండు సార్లు సమావేశమవ్వడంపై ట్రంప్ ప్రశ్నించారు. అయితే కిమ్తో సమావేశం పట్ల ట్రంప్ సానుకూలంగా స్పందించారు. సమావేశం జరిగే అవకాశం ఉండొచ్చు అనే విధంగా మాట్లాడారు. సమావేశం ఏర్పాట్ల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. సమావేశం గురించి ఇప్పుడు పూర్తి వివరాలు వెల్లడించలేను.. కానీ త్వరలోనే తెలుస్తుంది అని ట్రంప్ మీడియాతో అన్నారు.